బాలీవుడ్ చిత్రాలు భారత్ను తక్కువ చేసి చూపిస్తున్నాయ్ : రిషబ్ శెట్టి
- MediaFx

- Aug 21, 2024
- 1 min read
‘కాంతార’ సినిమాతో టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచాడు కన్నడ యాక్టర్ రిషబ్శెట్టి (Rishab Shetty). ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తెరకెక్కించిన ‘కాంతార’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లోనూ ఈ చిత్రం సత్తా చాటింది. ఈ సినిమాలో నటనకు గానూ రిషబ్ షెట్టి (Rishab Shetty) ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవడమే కాకుండా.. ఉత్తమ ప్రేక్షక ఆదరణ అందించిన చిత్రంగా కాంతార నిలిచింది. దీంతో రిషబ్ శెట్టిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ చిత్రపరిశ్రమపై కాంతార హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భారతదేశాన్ని బాలీవుడ్ చిత్రాలు (Bollywood films) తక్కువ చేసి చూపిస్తున్నాయన్నారు. ఇటీవలే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారతీయ సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాలు భారతదేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి. ఈ కళాత్మక చిత్రాలను గ్లోబల్ ఈవెంట్లకు ఆహ్వానిస్తారు. రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతారు. నా దేశం, నా రాష్ట్రం, నా భాష.. వీటన్నింటి గురించి సానుకూలంగా ఎందుకు చూపించకూడదు..? దేశం గర్వపడేలా సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నాను. నా సినిమాల ద్వారా భారతదేశాన్ని పాజిటివ్ నోట్లో చూపించాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు. రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.












































