ఏపీలో రాష్ట్రపతిపాలన పెట్టాలన్న వైఎస్ జగన్..
- MediaFx

- Jul 19, 2024
- 1 min read
బెంగళూరు పర్యటనలో ఉన్న వైఎస్ జగన్, విషయం తెలుసుకున్న తరువాత తాడేపల్లికి వచ్చారు. ఈరోజు మంగళగిరి నుంచి రోడ్డు మార్గం ద్వారా వినుకొండ చేరుకున్నారు. దారిపొడవునా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, మాజీ మంత్రులు ఘన స్వాగతం పలికారు. అభిమానులకు కారులో నుంచి అభివాదం చేస్తూ పలకరించారు. వినుకొండ చేరుకున్న వెంటనే రహదారిపొడవునా కార్యకర్తలు వైఎస్ జగన్ను చూసేందుకు ఉత్సాహం చూపించారు. ఆ తరువాత బాధితుని ఇంటికి చేరుకున్న జగన్ ముందుగా ప్రాణాలు కోల్పోయిన రషీద్ కు పుష్పాంజలి ఘటించారు.
వైఎస్ జగన్ ను చూసిన వెంటనే రషీద్ కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. చెట్టంత కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలిపించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జగన్ పరామర్శించేందుకు రావడంతో రషీద్ కుటుంబ సభ్యులకు ధైర్యం, అండ లభించిందని భావించారు. పోలీసుల తీరుతో పాటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కూడా జగన్ కు వివరించారు. తన కొడుకును చంపిన వాళ్లను రోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తరువాత వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేయడం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఏపీలో రాష్ట్రపతిపాలన పెట్టాలని డిమాండ్ చేశారు. 45 రోజుల్లో 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయన్నారు. 560 ప్రైవేట్, 450 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. వెయ్యికిపైగా దౌర్జన్యాలు చేశారని వివరించారు. రాష్ట్రంలో ఆటవికపాలన సాగుతోందన్నారు.
ఇప్పటి వరకూ 35 రాజకీయ హత్యలు జరిగాయన్నారు. గత రెండు రోజుల క్రితం కూడా రషీద్ అనే కార్యకర్తను దారుణంగా హత్య చేశారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారన్నారు. రషీద్ హత్య వెనుక పోలీసుల వైఫల్యం ఉందన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తూ ప్రధాన మంత్రి మోదీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వేదికగా జూలై 24 బుధవారం ధర్నా చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తనతోపాటూ 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొననున్నట్లు తెలిపారు.












































