‘బీజేపీ హిందువులకు వ్యతిరేకం’.. రాహుల్గాంధీ ప్రసంగంపై లోక్సభలో రచ్చ..
- MediaFx
- Jul 2, 2024
- 1 min read
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాహుల్గాంధీ చేసిన ప్రసంగంపై రచ్చ రాజుకుంది. బీజేపీని, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు రాహుల్గాంధీ. శివుడి నుంచి తాను ప్రేరణ పొందానని , శివుడి ఫోటోను రాహుల్ గాంధీ లోక్సభలో చూపించారు. అయితే స్పీకర్ అభ్యంతరం తెలిపారు. శివుడి ఫోటోను చూపిస్తే తప్పవుతుందా..? అని రాహుల్ ప్రశ్నించారు. శివుడు శాంతికి ప్రతీక, హింసకు వ్యతిరేకమని.. బీజేపీ హిందువులకు వ్యతిరేకమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్. భగవాన్ శివుడి నుంచి తాను ప్రేరణ పొందినట్టు తెలిపారు. హిందుత్వ పేరుతో దేశ ప్రజలను బీజేపీ భయపెడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ మణిపూర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మణిపూర్లో అంతర్యుద్దం జరుగుతుందన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను గాలికొదిలేశారని పేర్కొన్నారు. బడా పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారని పైర్ అయ్యారు. తాను దేవుడితో నేరుగా మాట్లాడతానని మోదీ చెప్పారు.. నోట్ల రద్దు చేయాలని దేవుడే మోదీకి చెప్పి ఉంటారంటూ రాహుల్ పేర్కొన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను సర్వనాశనం చేశారని.. ఉద్యోగాలు లేక యువత అల్లాడుతోందన్నారు. అగ్నివీర్ పథకంపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్. అగ్నివీర్ జవాన్లు యుద్దంలో చనిపోతే అమర జవాన్ హోదా లభించదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామన్నారు. ఈ సారి గుజరాత్ లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని.. రాసిపెట్టుకోండంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రైతులను పట్టించుకోలేదని.. 700 మంది చనిపోయారని తెలిపారు. జీఎస్టీ వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని.. నోట్ల రద్దు వల్ల ఎవరికీ ప్రయోజనం చేకూరిందని రాహుల్ పేర్కొన్నారు. అయోధ్యలో భూముల్ని లాక్కొని విమానాశ్రయం నిర్మించారంటూ ఆరోపించారు.