top of page

అసెంబ్లీ ఎన్నికలకు మించి పోలింగ్..


తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ మే 13న జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈసారి పోలింగ్‌లో ఓటర్లు కసిగా ఓటేసినట్టుగా.. గణాంకాలు చూస్తే తెలుస్తోంది. గతంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో (2019) కంటే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (2023) పోలైన ఓటింగ్ శాతం కంటే.. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. మొత్తంగా ఈ సారి 65.67 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అత్యధికంగా భువనగిరి పార్లమెంట్‌లో 76.78 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌ లోక్ సభ సెగ్మెంట్లో 48.48 శాతం పోలింగ్ శాతం నమోదైనట్టు పేర్కొన్నారు. అయితే.. ఈ పెరిగిన పోలింగ్ శాతాన్ని చూస్తుంటే.. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల పర్వం మొదలైనప్పటి నుంచి.. మూడు ప్రధాన పార్టీలు ఎవరికి అనుగుణంగా వాళ్లు అధిక స్థానాలు తమకే వస్తాయన్న ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రాబట్టిన కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికల్లోనూ 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటామంటూ మొదటి నుంచి నమ్మకంగా చెప్తోంది.

ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా వచ్చిన కాంగ్రెస్ సర్కారు మీద 5 నెలల్లోనే వ్యతిరేఖ వచ్చిందని.. ఆ ఓటింగ్ మొత్తం తమకు కలిసి వస్తోందని.. దీంతో 10 నుంచి 12 సీట్లు గెలుచుకుంటున్నామని ధీమా వ్యక్తం చేసింది. ఇక.. బీజేపీ కూడా అసెంబ్లీలో తమకు ఓటింగ్ శాతం పెరిగిందని.. మోదీ మేనియాతో ఈ ఎన్నికల్లోనూ తమకు డబుల్ డిజిట్ నెంబర్ వస్తుందంటూ ధీమా వ్యక్తం చేసింది. మరి.. ఇప్పుడు పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి లాభం చేకూర్చనుందన్నది జూన్ 4న తేలనుంది.


 
 
bottom of page