top of page

Asia Cup 2023: బీసీసీఐ దెబ్బకు పాకిస్థాన్ చేజారిన ఆసియా కప్ ఆతిథ్యం..! శ్రీలంకలో నిర్వహించే అవకాశం

సెప్టెంబర్ 2 నుంచి ఆసియా కప్ -2023 క్రికెట్ టోర్నీ పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉంది. తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నీ వేదికను పాకిస్థాన్ నుంచి శ్రీలంకకు మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Asia Cup 2023: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి గట్టి షాకిచ్చింది. ఆసియా‌కప్-2023 క్రికెట్ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. సెప్టెంబర్ 2న ఈ టోర్నీ ఆరంభమవుతుంది. అయితే, ఆసియా కప్ పాకిస్థాన్‌లో నిర్వహించనుండటంతో భారత జట్టును పాకిస్థాన్‌కు పంపేదిలేదని బీసీసీఐ ఖరాఖండీగా చెప్పిన విషయం విధితమే. పలు దఫాల చర్చల అనంతరం భారత్ జట్టు ఆడే మ్యాచ్‌లు యూఏఈలో నిర్వహించేలా పీసీబీ ఆమోదంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయించింది. భారత్ తన మ్యాచ్‌లను యూఏఈలో ఆడేందుకు పాకిస్థాన్ చేసిన హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను మిగిలిన సభ్య దేశాలు తిరస్కరించాయి. దీంతో ఏసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఆసియా కప్ 2023ను పాకిస్థాన్‌లో కాకుండా యూఏఈలో నిర్వహించాలని తొలుత ఏసీసీ భావించింది. టోర్నీ జరిగే సమయంలో యూఏఈలో అత్యంత తేమతో కూడిన పరిస్థితులవల్ల ఆటగాళ్లకు గాయాలయ్యే అవకాశం ఉంది. యూఏఈ కాకుండా తరువాత స్థానంలో శ్రీలంక ముందజలో ఉంది. దాదాపు శ్రీలంకలోనే ఆసియా కప్ టోర్నీ నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఏసీసీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే మంగళవారం జరిగే సమావేశంలో ఏసీసీ ఈ మేరకు ప్రకటన చేస్తుందని సమాచారం. మొత్తానికి బీసీసీఐ దెబ్బకు పీసీబీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పొచ్చు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page