top of page

యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం..


భారత నేవీ యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నౌక బాగా ధ్వంసమైంది. ఓ నావికుడు గల్లంతయ్యాడు. నిర్వహణ పనుల కోసం ముంబై డాక్‌యార్డ్‌లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన జూనియర్ సైలర్ కోసం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం తర్వాత నౌక ఓ వైపు ఒరిగిపోతున్నట్టు పేర్కొన్నారు. ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఒకవైపు మునిగిపోతున్న నౌకను తిరిగి యథాతథ స్థితికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని నేవీ పేర్కొంది. అది ఒకవైపు ఒరిగిపోతూనే ఉందని తెలిపింది. ఒక్క జూనియర్ సైలర్ తప్ప మిగతా అందరినీ రక్షించామని, గల్లంతైన నావికుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొంది.

ఈ ప్రమాదంపై నేవీ విచారణకు ఆదేశించింది. తాజా ఘటనతో కలిపి గత 11 సంవత్సరాల్లో మూడు నౌకలు మునిగిపోయాయి. 2013లో ఐఎన్ఎస్ సింధురక్షక్, 2016 ఐఎన్ఎస్ బెత్వా నౌకలు మునిగిపోయాయి. దేశీయంగా నిర్మించిన తొలి యుద్ధ నౌక అయిన ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర.. క్లాస్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్‌లో మొదటిది. ఏప్రిల్ 2000లో దీనిని నేవీలోకి ప్రవేశపెట్టారు. ఇందులో 40 మంది అధికారులు, 330 మంది సైలర్లు ఉంటారు. మధ్యశ్రేణి, క్లోజ్ రేంజ్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లు, ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులు, టార్పెడో లాంచర్లతో బలమైన రక్షణ వ్యవస్థ ఇందులో ఉంది. దీంట్లో సముద్రం నుంచే అన్ని కోణాల్లోనూ నిఘాపెట్టగల సెన్సార్లు ఉన్నాయి. అంతేకాదు, సీకింగ్, చేతక్ హెలికాప్టర్లను కూడా ఆపరేట్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఈ యుద్ధనౌక బరువు 5,300 టన్నులు. పొడవు 125 మీటర్లు. 27 నాటికల్ మైల్ వేగంతో ఇది ప్రయాణించగలదు.



 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page