top of page

కేరళలో నిఫా వైరస్‌ కలకలం..తమిళనాడు సర్కార్ అప్రమత్తం.!


ప్రమాదకరమైన నిఫా వైరస్ భారత్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే కేరళలో ఓ బాలుడు నిఫా వైరస్ సోకి మృత్యువాత పడ్డాడు. వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన గంటలోనే బాలుడు మృతి చెందడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రాణాంతకమైన వైరస్ కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. నిఫా వైరస్ వ్యాప్తి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. నిఫా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న చోట క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

కేరళలో నిఫా వైరస్‌ కలకలంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు. కేరళను ఆనుకుని ఉండే నీలగిరి జిల్లాలో కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నెల్లియాళం, తాలూరు, అంబలమూలా తదితర ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల వైద్యులను ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. జ్వరం, ఎర్రటి దద్దుర్లు, బ్రెయిన్‌ ఫీవర్, మూర్ఛ తదితర లక్షణాలతో ఎవరైనా వస్తే వారిని క్వారంటైన్‌ చేసి తగిన చికిత్స అందించటంతో పాటు వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని జిల్లా ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ తెలిపారు.

మరోవైపు తమిళనాడు, కేరళ సరిహద్దు ప్రాంతమైన వాళైయార్‌ వద్ద కేరళ నుంచి కోయంబత్తూరుకు వచ్చే వాహనాల్లో ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రత్యేక మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిఫా వైరస్ తొలిసారిగా 1999లో వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి వ్యాక్సిన్ లేదు. ఇది జంతువుల ద్వారా మనుషులకు సోకుతుంది. 2018లో కేరళలో ఈ వైరస్ బారినపడి 27 మంది మృతి చెందారు. తాజాగా, కేరళలో మరోమారు నిఫా కలకలం రేగడంతో, కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక వైద్య బృందాన్ని కేరళకు పంపింది.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page