top of page

ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రధాని మోదీ కీలక ట్వీట్‌


2019 ఆగస్టు 5వ తేదీ భారత తేదీ చరిత్రలో సరికొత్త అధ్యాయనం. అప్పటి వరకు అసాధ్యం అనుకున్న దానిని భారత ప్రభుత్వం నిజం చేసిన రోజు. జమ్ము కశ్మీర్‌ రాష్ట్రానికి సంబంధించి పొందుపరిచిన ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన రోజు. దేశం మొత్తం ఒక చట్టం ఉన్నట్లే జమ్మూకశ్మీర్‌లోనూ అదే చట్టం అమల్లో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం. ఆర్టికల్‌ 370 రద్దు చేసి నేటితో (సోమవారం) ఐదేళ్లు గడిచిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఈ విషయమై మోదీ ట్వీట్ చేస్తూ.. దేశ చరిత్రలో కీలక ఘట్టమైన ఆర్టికల్ 370, 35 (ఏ)లను రద్దు చేస్తూ పార్లమెంట్‌ నిర్ణయించి ఐదేళ్లు గడుస్తోంది. ఈ నిర్ణయం జమ్మూ కశ్మీర్‌తో పాటు, లడఖ్‌లో పురోగతికి, శ్రేయస్సుకు సంబంధించి కొత్త శకానికి నాంది పలికింది. రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయులతో పాటు ప్రతీ ఒక్కరి దృక్పథానికి అనుగుణంగా భారత రాజ్యాంగం ఈ ప్రదేశాల్లో అమలైందని దీని అర్థం అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. ఆర్టికల్‌ రద్దు ద్వారా, అప్పటి వరకు అభివృద్ధి ఫలాలు అందుకోలేని మహిళలు, యువత వెనకబడిన, గిరిజన, అట్టడగు వర్గాలకు భద్రత, గౌరవం, అన్ని రంగాల్లో అవకాశాలు లభించాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఇక దశాబ్ధాలుగా జమ్మూకశ్మీర్‌ను పట్టి పీడిస్తున్న అవినీతిని అరికట్టేలా ఆర్టికల్‌ 370 రద్దు చేసిందని మోదీ ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ ప్రజల కోసం పనిచేస్తుందని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఆర్టికల్‌ 370 ఆర్టికల్‌ను రద్దు చేసి ఐదేళ్లు పూర్తయిన నేపథ్యంలో కేంద్రం భద్రత విషయంలో కీలక చర్యలు చేపట్టింది. ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్‌ల రాకపోకలను నిలిపివేశారు. జవాన్ల కాన్వాయ్‌లపై దాడి జరిగే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.



 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page