top of page

బీజేపీ నేతలకు మావోల హెచ్చరిక..


చత్తీస్‌ఘడ్‌‎లోని కంకేర్‌ అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల గురించి కచ్చితమైన సమాచారంతోనే పోలీసులు మెరుపుదాడి చేశారు.  నార్త్‌ బస్తర్‌ డివిజన్‌ కమిటీ సమావేశం గురించి కచ్చితమైన ఇంటెలిజెన్స్‌ సమాచారంతోనే భద్రతా బలగాలు దాడి చేశాయి. గత నెల రోజుల నుంచి మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా పెట్టారు. హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. 200 మంది జవాన్లు దట్టమైన అటవీ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లారు. బస్తర్‌ ఫైటర్స్‌ , డీఆర్‌జీతో పాటు బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కూంబింగ్‌లో పాల్గొన్నారు. నదీ ప్రాంతాన్ని దాటగానే భద్రతా దళాలు కదలికలను గమనించిన మావోయిస్టు సానుభూతిపరులు బాణాసంచా కాల్చారు. మావోయిస్టులను అప్రమత్తం చేయడానికి ప్రయత్నించారు. కాని అలర్ట్‌గా ఉన్న జవాన్లు రెండు దిక్కుల్లో కూంబింగ్‌ను కొనసాగించారు. ఇది తునికాకు సేకరణ సీజన్‌ కావడంతో కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లు చేయడానికి అక్కడికి మావోయిస్టులు వచ్చినట్టు గుర్తించారు. మావోయిస్టులు వాడిన విస్తరాకుల ఆధారంగా వాళ్ల క్యాంప్‌ను గుర్తించి పోలీసులు చుట్టుముట్టారు. నారాయణ్‌పూర్‌ అటవీ ప్రాంతం దగ్గర ఇరుపక్షాల మధ్య హోరాహొరి కాల్పులు జరిగాయి. మావోయిస్టుల ఏరివేతకు గత జనవరిలో సూర్యశక్తి ఆపరేషన్‌ నిర్వహించారు. దీనికి భిన్నంగా తాజా ఆపరేషన్‌ కొనసాగింది. వాస్తవానికి మావోయిస్టు అగ్రనేత శంకర్ రావును అరెస్ట్‌ చేయడానికి తాము ప్రయత్నించామని , కాని అటువైపు నుంచి కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ తరువాత మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బీజేపీ నేతలు ఎన్‌కౌంటర్‌కు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఇప్పటికే మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. ఈనెల 25వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చారు.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page