top of page

తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఎండ తీవ్రత జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరిక..


రోజు రోజుకీ భానుడు భగభగ మండుతున్నాడు. తెలుగు రాష్ట్రాలు నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మరో 4 రోజుల్లో 49కి చేరొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నెలాఖరు వరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యశాఖలు కూడా హెచ్చరించాయి.

ఎల్ నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతుండటంతో ఎండ తీవ్రత మరింత పెరిగింది. తెలంగాణలో పలుచోట్ల 46 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 30వ తేదీ ఉష్ణోగ్రతల్లో పదేళ్ల కాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 4 రోజుల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఎండల తీవ్రత కారణంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండుతున్నాయి. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ నెలలో 48 నుండి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వడగాల్పుల కారణంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఇళ్లలోంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page