top of page

నోరులేని జంతువులను కూడా వదిలిపెట్టలేదు! జూ పై బంగ్లాదేశ్‌ ఆందోళనకారుల దాడి..వీడియో వైరల్‌


మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల విషయంలో వెల్లువెత్తిన నిరసనలు భయానకంగా మారాయి. ఈ నిరసన ఇప్పుడు హింసాత్మక రూపం దాల్చింది. ఆందోళనకారుల ఆగ్రహంతో దేశం ఉన్మాదంగా మారింది. ఈ హింసకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక ఇళ్ళు దగ్ధమయ్యాయి. అలాగే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రోజురోజుకు ఈ నిరసన హింసాత్మకంగా మారుతోంది, ఇటీవల ఆందోళనకారులు ప్రధాని నివాసంలోకి చొరబడి షేక్ హసీనా బట్టలు, ఇతర విలువైన వస్తువులను దోచుకున్నారు. ఇప్పుడు నిరసనకారులు అక్కడి జంతుప్రదర్శనశాలను కూడా ముట్టడించారు. అక్కడ జంతువులను కిడ్నాప్ చేశారనే సాకుతో మూగ జంతువులను హింసించారు. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ విషయంపై X ఖాతా, oliLondonTVలో ఒక పోస్ట్ షేర్‌ చేయబడింది. వందల మంది నిరసనకారులు నేషనల్ జూపై దాడి చేసి, జంతువులను హింసించారు. ఢాకా జంతుప్రదర్శనశాలలోకి చొరబడిన నిరసనకారులు అక్కడ ఉన్న జంతువులను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించడం వైరల్ అయిన వీడియోలో కనిపిస్తుంది. వారి హంగామాకు భయపడిన ఓ జింక, తాను బతికి ఉంటే చాలు దేవుడా అన్నట్టుగా నిరసనకారుల చేతుల్లో తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆగస్ట్ 06న షేర్ చేసిన ఈ పోస్ట్‌కి 2 మిలియన్లకు పైగా వీక్షణలు, అనేక కామెంట్‌లు వచ్చాయి. ఒక నెటిజన్‌ స్పందిస్తూ..ఈ దృశ్యం నిజంగా భయానకంగా ఉందన్నారు. ఇవన్నీ అమానవీయ చర్యలుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలో జంతువులను హింసించిన వారిపట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదలి వెళ్లిపోయారు. నిరసనకారులు మాత్రం హసీనా పార్టీ అవామీ లీగ్‌ పార్టీకి చెందిన నేతలను వేటాడి ఊచకోత కోస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో పదుల సంఖ్యలో అవామీ లీగ్‌ నేతలు మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.




 
 
bottom of page